ఫోన్ ట్యాపింగ్ కేసు తెలంగాణ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. తాజాగా ఈ కేసులో ఏసీబీ అధికారులు రంగప్రవేశం చేయడం ఇప్పుడు కీలక మలుపు అని చెప్పాలి. ఈ కేసులో అరెస్ట్ అయిన అదనపు ఎస్పీలు భుజంగరావు, తిరుపతన్న, టాస్క్ఫోర్స్ మాజీ డీసీపీ రాధాకిషన్ రావు, డీఎస్పీ ప్రణీత్ రావులు.. వ్యాపారవేత్తలు, హవాలా వ్యాపారం చేసే వారు, నగల షాపు యజమానులపై బెదిరింపులకు పాల్పడి భారీ స్థాయిలో ఆస్తులు కూడబెట్టారనే ఆరోపణలు వచ్చాయి. ఇలా కూడబెట్టిన ఆస్తుల్లో ఖరీదైన విల్లాలు, భూములు ఉన్నట్టు సమాచారం.
ఈ నేపథ్యంలోనే తాజాగా ఏసీబీ అధికారులు ఈ కేసుపై దృష్టి సారించారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో అరెస్టయిన వారితో పాటు ఆరోపణలు ఎదుర్కొంటున్న అధికారుల ఆస్తుల చిట్టాను బయటకు తీసే పనిలో పడినట్టు తెలుస్తోంది. దీంతో ఈ కేసులో అర్టెయిన వారితో పాటు అనుమానితులు కూడా హడలెత్తిపోతున్నారు.