ఆప్-కాంగ్రెస్ ల మధ్య పొత్తు దిశగా అడుగులు పడుతున్నాయని, కాంగ్రెస్కు 15 స్థానాలు కేటాయించేలా చర్చలు జరుగుతున్నాయని వార్తలు వచ్చాయి. 1-2 స్థానాలు ఇండియా కూటమిలోని ఇతర పార్టీలకు కేటాయించనున్నట్లు పేర్కొనగా, వాటిని తాజాగా కేజ్రీవాల్ తోసిపుచ్చారు. ఇక ఈ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో తన అభ్యర్థులతో కూడిన రెండు జాబితాలను ఆప్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. రెండు విడతల్లో 31 మంది అభ్యర్థుల పేర్లను ప్రకటించింది.
ఇదిలాఉంటే.. మద్యం కుంభకోణం కేసులో ఆరోపణలు ఎదుర్కొని.. జైలుకు వెళ్లి వచ్చిన ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్ ప్రజలు మళ్లీ తనకు విశ్వసనీయత సర్టిఫికెట్ ఇచ్చేవరకూ సీఎం పదవిలో ఉండబోనని కొన్ని నెలల క్రితం ప్రకటించిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఆయన ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసి, రానున్న ఎన్నికల కోసం పార్టీని ముందుకునడిపిస్తున్నారు. ఆప్ నేత ఆతిశీ దిల్లీకి ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు.ఇక ఈ ఎన్నికల వేళ ‘సీఎం బంగ్లా’ వివాదం రాజకీయ దుమారం రేపుతోంది. తనను తాను సామాన్యుడిగా చెప్పే మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్.. అధికారంలో ఉన్న సమయంలో రూ.కోట్లు ఖర్చు పెట్టి ముఖ్యమంత్రి నివాసానికి మార్పులు చేశారని భాజపా కొంతకాలంగా ఆరోపిస్తోన్న సంగతి తెలిసిందే. ప్రజాధనం ఉపయోగించి కేజ్రీవాల్ ఇంధ్ర భవనాన్ని నిర్మించుకున్నారని భాజపా మండిపడింది. దీన్ని ఆప్ తీవ్రంగా ఖండించింది. ‘‘విద్య, ఆరోగ్య సంస్కరణల గురించి ప్రజలు అడుగుతుంటే.. వారు మాత్రం బంగ్లాల గురించి మాట్లాడుతున్నారు’’ అని ఆగ్రహం వ్యక్తంచేసింది.